20-05-2025 01:07:09 AM
ఎల్బీనగర్, మే 19 : బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ ఎన్జీవో కాలనీలో అద్భుతంగా గ్రంథాలయ భవనాన్ని నిర్మించనున్నట్లు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా గ్రంథాలయాన్ని నిర్మిస్తామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. ఎన్జీవో కాలనీలో నూతన గ్రంథాలయం నిర్మాణానికి ఈ నెల 1వ తేదీ ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. త్వరలో లైబ్రరీ భవనం నిర్మాణ పనులు ప్రారంభం కానుండడంతో సోమవారం బషీర్ బాగ్ లోని తెలంగాణ రాష్ర్ట గ్రంథాలయ పరిషత్ కార్యాలయంలో పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు పీవీ శ్రీహరితో ఎమ్మెల్యే శ్రీ సుధీర్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మొదటి అంతస్తులో సీనియర్ సిటిజన్స్ భవనం, రెండో అంతస్తులో కాలనీ సంక్షేమ సంఘ భవనం, మూడో అంతస్తులో మహిళా భవనం, నాలుగవ అంతస్తులో రంగస్థల కళాకారుల కోసం హై సీలింగ్ తో నిర్మాణం చేపట్టే విధంగా స్టీల్ డిజైన్ చేయాలని ఎమ్మెల్యే కోరారు. మొత్తం %%4 నిర్మాణంతో అద్భుతమైన గ్రంథాలయ భవనాన్ని నిర్మించాలని గ్రంథాలయ సంచాలకుడు శ్రీహరిని కోరారు.
ఎమ్మెల్యే సూచించిన ప్లానింగ్ ప్రకారం గ్రంథాలయ పనులను ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. గ్రంథాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి సహకారంతో అదనపు నిధులు తెస్తామని సుధీర్ రెడ్డి తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డి పాల్గొన్నారు.