29-06-2025 12:00:00 AM
విష్ణు మంచు హీరోగా నటిచిన చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. శుక్రవారం రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. శనివారం చిత్రయూనిట్ థాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కథానాయకుడు విష్ణు మంచు మాట్లాడుతూ.. ‘మాలాంటి ఆర్టిస్టులకు ప్రేక్షకులే దేవుళ్లు. వారి ఆదరణ, ప్రేమతోనే మేం ఈ స్థాయికి వస్తాం.
‘కన్నప్ప’కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇదంతా శివలీల” అన్నారు. చిత్ర దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. “కన్నప్ప’ మీద అందరూ ప్రేమను కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి ఈ మూవీకి పనిచేశారు” అని చెప్పారు. నిర్మాత, నటుడు మోహన్బాబు మాట్లాడుతూ.. “ఆ భగవంతుడు ఆశీస్సులతోనే ‘కన్నప్ప’ చిత్రానికి ఇంత గొప్ప విజయం దక్కింది.
మా టైంలో ఓ సినిమాకు ఇన్ని సభలు పెట్టేవాళ్లం కాదు. నటుడిగా 50 ఏళ్లు అవుతోంది. నా అభిమానులు వెన్నంటే ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. వారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటీనటులు అర్పిత్ రంకా, శివ బాలాజీ, కౌశల్, మైత్రి శశి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ మహేశ్వరి తదితర చిత్రబృందం పాల్గొన్నారు.