30-09-2025 01:21:10 AM
హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూని వర్సిటీ 26వ స్నాతకోత్సవం యూనివర్సిటీ క్యాంపస్లోని భవనం వెంకట్రాం ఆడిటోరియంలో మంగళవారం జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్, యూనివర్సిటీ ఛాన్స్లర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొంటారు. ఈ సందర్భంగా పీహెచ్డీ పట్టాలు, బంగారు పతకాలు, బుక్ ప్రైజ్లు విద్యార్ధులకు గవర్నర్ ప్రదానం చేస్తారు.
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ (న్యూఢిల్లీ) ప్రొ.ఉమా కాంజీలాల్ ముఖ్యఅతిథిగా పాల్గొని స్నాతకోత్సవ ప్రసంగం చేయనున్నారు. డా. బీ.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొ. ఘంటా చక్రపాణి స్నాతకోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు.
ఈ స్నాతకోత్సవంలో తెలుగు సాహిత్యానికి అందించిన సేవలకు గానూ ప్రఖ్యాత గేయ రచయిత, కవి గోరటి వెంకన్నకి గౌరవ డాక్టరేట్ అందించనున్నారు. అదేవిధంగా ప్రఖ్యా త శాంతి, విద్యా ప్రచారకులు, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకర విధానంలో పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను ప్రోత్సహించి, నేరాల శాతం తగ్గించడానికి కృషి చేస్తున్న ప్రముఖ రచయిత ప్రేమ్ రావత్కు సైతం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు.