30-09-2025 01:19:51 AM
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
భద్రాచలం, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రా చలం వద్ద గోదావరి వరద మరోసారి పెరుగుతున్నది. భద్రాచలం ఎగువ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా భద్రాచలం వద్ద నీటిమట్టం పెరుగుతున్నది. సోమవారం సాయంత్రం 6 గంటలకు 45.50 అడుగులు ఉండగా మంగళవారం నాటికి రెండో ప్రమాద హెచ్చరికైన 48 అడుగులకు చేరుకుంటుందని అంచనా తో అధికారులు వరద సహాయక సిబ్బందిని అప్రమత్తం చేశారు.
ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. ఎగువన గల పేరూరు వద్ద సోమవారం సాయంత్రం 6 గంటలకు 17.220 మీటర్లలో గోదావరి నది ప్రవహిస్తున్నందున ఆ నీరు భద్రాచలం చేరుకుంటే 48 అడుగులకు పైగా నీటిమట్టం నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం వెళ్లే రహదారిపై పలుచోట్ల గోదావరి బ్యాక్ వాటర్ రోడ్డును ముంచి వేయడంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.