29-07-2025 01:46:49 PM
టీపీసీసీ ఓబీసీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరన్న
మహబూబాబాద్,(విజయక్రాంతి): పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం, కాంగ్రెస్ తోనే బీసీల అభ్యున్నతి సాధ్యమని, కాంగ్రెస్ పార్టీకి బీసీలు వెన్నంటి ఉండాలని టీపీసీసీ ఓబిసి సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన దేవత అని, పదేళ్లపాటు తెలంగాణను పరిపాలించిన బీఆర్ఎస్ పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, ప్రజలు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారని, ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు సాగుతూ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు.
బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై ఎలాంటి అనుమానాలకు తావు లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రిజర్వేషన్లు అమలు చేసే తీరుతుందని, దీనితో రానున్న రోజుల్లో బీసీలకు అన్ని రంగాల్లో అవకాశాలు దక్కి తీరుతాయన్నారు. రానున్న రోజుల్లో బీసీలంతా సంఘటితంగా కాంగ్రెస్ పార్టీకి వెన్ను దన్నుగా నిలవాలని, రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని వీరన్న యాదవ్ కోరారు.