03-08-2025 05:58:06 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాల, బాలికల జూనియర్ కళాశాలల్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ప్రిన్సిపల్స్, లెక్చరర్ల ఆత్మీయ సమ్మేళనం స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ నరసింహం అధ్యక్షత వహించగా, కళాశాల ప్రిన్సిపాల్ పొక్కుల సదానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాము విధులు నిర్వహించిన నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, విద్యా బోధనకు, కళాశాలల అభివృద్ధికి చేసిన కృషిని వివరించారు.
నాటికి నేటికి విద్యా వ్యవస్థలో వచ్చిన సమూలమైన మార్పులను వివరించారు. కళాశాలలో పనిచేస్తున్న సమయంలో జరిగిన సంఘటనలను ఆనాటి విద్యార్థుల క్రమశిక్షణ , చదువు పట్ల వారు చూపిన శ్రద్ధ , ప్రస్తుతము వారు వివిధ రంగాలలో రాణించిన తీరుపై చర్చించారు. కళాశాల అభివృద్ధి పథంలో నడుపుతూ 550 మంది విద్యార్థులతో, కళాశాల అన్ని వసతులను ఏర్పాటు చేసి కళాశాలను పూలవనంలా మార్చిన కళాశాల ప్రిన్సిపాల్ పొక్కుల సదానందం ను ప్రశంసించారు.