calender_icon.png 14 January, 2026 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ సుంకాల బాంబ్

14-01-2026 02:00:32 AM

ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలున్న ప్రతి దేశంపై పిడుగు

అదనంగా ౨౫శాతం ఎగుమతి సుంకం విధిస్తామని ప్రకటన

భారత్‌కు విధించిన సుంకాలు ౫౦శాతం

తాజా నిర్ణయంతో ౭౫శాతానికి పెరిగిన సుంకాలు

ఇండియాను ఇరుకున పెట్టేందుకే ఈ ఎతగడలా?

వాషింగ్టన్, జనవరి ౧౩: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల బాంబ్ పేల్చారు. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న ఏ దేశమైనా ఇకపై అమెరికాతో వ్యాపారం చేయాలంటే 25 శాతం అదనపు సుంకం చెల్లించాలని హుకుం జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా స్పష్టం చేశారు. ఇరాన్ ప్రభుత్వం అక్కడి పౌరులను అణచివేస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తేల్చిచెప్పారు. చైనా తర్వాత ఇరాన్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఇండియానే కాబట్టి మన దేశంలోపై సుంకాల ప్రభావం ఎక్కువ ఉండనుంది. అమెరికా ఇప్పటికే భారత్‌పై ౫౦శాతం సుంకాలు విధిస్తున్నది. ఇరాన్ సాకుతో విధించే సుంకంతో ఎగుమతి సుంకం కాస్తా ౭5 శాతానికి చేరుకోనున్నది. ట్రంప్ తాజా ప్రకటన భారత ఎగుమతిదారులకు పెద్ద శరాఘాతమే. 

భారత్‌ను లొంగదీసుకుని అమెరరికాకు అనుకూలంగా ఒప్పందం కుదుర్చుకునేంకే ట్రంప్ ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని మోదీ నేరుగా కాల్‌చేసి తనతో మాట్లాడలేదన్న అసంతప్తి కూడా ట్రంప్ నిర్ణయం వెనుక ఉందని పేర్కొంటున్నారు. అధిక సుంకాల కారణంగా బాస్మతి రైస్, టీ, చక్కెర, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇరాన్‌కు భారత్ ఏటా సుమారు 10 వేల కోట్ల విలువైన వస్తువులను ఎగుమతి చేస్తోంది. మరోవైపు ఇరాన్ లో నిర్మించే చాబహార్ ఓడరేవు పనులు కూడా భారత్‌కు కీలకం. ఇరాన్‌పై ఆంక్షలు పెంచడం వల్ల ఈ ఓడరేవు భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రష్యా చమురు పై ఇప్పటికే 500 శాతం పన్ను వేస్తామన్న హెచ్చరికల మధ్య.. ఇప్పుడు ఇరాన్ అంశం భారత్‌ను మరింత ఇరుకున పెట్టింది.