23-09-2025 01:36:32 AM
-కేంద్ర కమిటీ సభ్యులు రామచంద్రా రెడ్డి, సత్యనారాయణ రెడ్డి హతం
-ఒక్కొక్కరి తలపై 40 లక్షల చొప్పున రివార్డు
-ఇరువురిదీ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే..
చర్ల, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులిద్దరూ మరణించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణ్ పూర్ జిల్లాలో గల అభుజ్మద్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు సోమవారం భద్రతాదళాలు సెర్చ్ ఆపరేషన్ను మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా భద్రతాదళాలకు ఎదురుపడ్డ మావోయిస్టులు కాల్పులకు దిగారు.
ఎదురుకాల్పులు జరిపిన భద్రతాదళాలు మావో యిస్టు పార్టీ కేంద్ర కమటీ సభ్యులైన రాజు దాదా అలియాస్ కట్టా రామచంద్రా రెడ్డి (63), కోసా దాదా అలియాస్ కడారి సత్యనారాయణ రెడ్డి (67) ఇద్దరిని మట్టుబె ట్టారు. నారాయణ్పూర్ ఎస్పీ రాబిన్సన్ గురియా మాట్లాడుతూ.. ‘భద్రతాదళాల ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మరణించారు. మరణించిన ఇద్దరు నేతల తలలపై రూ. 40 లక్షల చొప్పున రివార్డు ఉంది.
సంఘటనా స్థలంలో ఏకే ఇన్సాస్ రైఫిల్, బిజిఎల్ లాంచర్, పెద్దమొత్తంలో పేలుడు పదార్థా లు, మావోయిస్టు సాహిత్యం, రోజువారీ వినియోగ వస్తువులు లభించాయి’ అని వెల్లడించారు. భద్రతాదళాల కాల్పుల్లో చనిపో యిన ఇద్దరు అగ్రనేతలది తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావడం గమనా ర్హం. వీరిరువురూ గత మూడు దశాబ్దాలుగా దండకారణ్య ప్రత్యేక ప్రాంతీయ కమిటీలో చురుగ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇద్దరిది ఉమ్మడి కరీంనగర్ ప్రాంతమే.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఈ ఇద్దరు నేతల తలలపై రూ. 40 లక్షల చొప్పున రివార్డు ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చిలోపు దేశంలో నక్సలిజాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటన నేపథ్యంలో భద్రతా దళాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. నక్సలైట్ల లొంగిపోవాలని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ విజ్ఞప్తి చేశారు.