12-07-2025 02:04:53 AM
తొమ్మిది మందికి పెరిగిన మృతుల సంఖ్య
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 11 (విజయ్క్రాంతి): నగరంలో పెను విషాదాన్ని మిగిల్చిన కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శుక్రవారం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగారాం (70) అనే వృద్ధుడు మృతి చెందడంతో మృతుల సంఖ్యల తొమ్మిదికి చేరింది. ఈ ఘటనలో మొత్తం 51 మంది అస్వస్థతకు గురికాగా, వారిలో ఇంకా 50 మంది నగరంలోని పలు ఆసుపత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు.
పోలీసు లు, ఎక్సైజ్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటివరకు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఐదు కేసులు, కూకట్పల్లి పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు నమోదు చేశారు. అధికారులు ఐదు ప్రధాన కల్లు కాంపౌండ్ల నుంచి కల్లు శాంపిల్స్ను సేకరించి, పరీక్షల నిమిత్తం నారాయణగూడ లోని ఎక్సైజ్ ల్యాబ్కు పంపించారు.
ఈ ఘటనపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నా రు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవ లు అందించాలని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.