01-08-2025 12:43:20 AM
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. భారీ అంచనాల నడుమ గురువారం విడుదలైన ఈ చిత్రం.. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించిన చిత్రబృందం తమ ఆనందాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “కింగ్డమ్’కు వస్తున్న స్పందన పట్ల మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది.
చాలా మంది ఫోన్ చేసి ‘అన్నా మనం హిట్ కొట్టినం’ అని ఎమోషనల్ అవుతున్నారు. నా తెలుగు ప్రజలు నా వెనుక ఎంత ఉన్నారో నిన్నటి నుంచి చూస్తు న్నా. ఆ వెంకన్న స్వామి ఆశీస్సులు, అభిమానుల ప్రేమ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇది 100 శాతం మనందరి హిట్. ఈ విజయాన్ని ప్రేక్షకుల మధ్యలో సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. తెలుగుతోపాటు యూఎస్ ఆడియన్స్ ను కూడా త్వరలో కలుస్తా” అన్నారు.
నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “ఒక తెలుగు సినిమాను సాంకేతికంగా హాలీవుడ్ స్థాయిలో తీశాం. విజయ్ దేవరకొండ అభిమానులు కోరుకున్నట్టు.. ఈ సినిమాతో ఆయన హిట్ కొట్ట డం ఆనందంగా ఉంది. మొదటి రోజే ఓవర్సీస్లో మేం ఎంతకు విక్రయించామో అందులో 50 శాతం వచ్చేసింది. రాయలసీమలోనూ 50 శాతం రాబట్టేసింది. నైజాంలో దాదాపు రూ.8 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్టుంది.
ఆంధ్రాలోనూ అనుకున్నంత కలెక్షన్స్ చేస్తుంది. విజయ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాత ‘కింగ్డమ్2’ చేస్తాం. అందులో ఓ పెద్ద హీరో కూడా కనిపిస్తారు. పార్ట్2లో హీరోయిన్ రోల్కు స్కోప్ ఎక్కువగా ఉంటుం ది” అని చెప్పారు. నటుడు సత్యదేవ్ మాట్లాడుతూ.. “నా సోదరుడు విజయ్ స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇవ్వడం చాలా ఆనందాన్నిచ్చింది.
సొంతంగా వచ్చి ఏదో సాధించాలనుకునే ఎందరికో విజయ్ స్ఫూర్తి” అని తెలిపారు. నటుడు వెంకటేశ్ మాట్లాడుతూ.. “ఇది నా మొదటి సక్సెస్ ప్రెస్మీట్. ప్రేక్షకులతో కలిసి కింగ్డమ్ చూశాను. ఈ సినిమాకి, ఇందులో నా పాత్రకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన సంతోషాన్ని కలిగించింది” అన్నారు.