calender_icon.png 1 February, 2026 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో యుద్ధం

25-09-2024 12:00:00 AM

 పశ్చిమాసియాలో మరో భీకర యుద్ధం మొదలైంది. ఇప్పటివరకు గాజాకు పరిమితమైన హమాస్‌ఇజ్రాయెల్ పోరు ఇప్పుడు లెబనాన్ వైపు మళ్లింది. గత మంగళ, బుధవారాల్లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లు, ఆ తర్వాత హెజ్‌బొల్లా కీలక కమాండర్ల మరణంతో పెరిగిన ఉద్రిక్తతలు ఇప్పుడు తారస్థాయికి చేరుకున్నాయి.

సోమవారం దక్షిణ లెబనా న్‌లో హిజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా  ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో దాదాపు 500 మంది మృతిచెందగా, వేలాది మంది గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రి ప్రకటించారు. మృతుల్లో పలువురు చిన్నారులు, మ హిళలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ దాడులతో దక్షిణ లెబనాన్‌లోని గ్రామాలు వణికి పోయాయి.

వేలాదిమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాహనాల్లో దేశ రాజధాని బీరూట్ వైపు పారిపోతున్నారు. అయితే తమ లక్ష్యం హిజ్‌బొల్లా మాత్రమేనని, లెబనాన్ పౌరులు కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.హిజ్‌బొల్లాకు రక్షణ కవచాలుగా మారవద్దని ఆయన లెబనాన్ పౌరులను హెచ్చరించారు.

అ యితే హిజ్‌బొల్లా, ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం ఇప్పటిది కాదని, దాదాపు నాలుగు దశాబ్దాల పూర్వమే ఇది పురుడు పోసుకుందని చరిత్ర చెబుతోంది. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్‌ఓ) నిర్మూలనే లక్ష్యంగా 1980లో లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడి చేసింది. రాజధాని బీరూట్‌నుంచి పీఎల్‌ఓను తరిమికొట్టింది.

అయితే ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని పీఎల్‌ఓలోని కొందరు 1982లో ఇజ్రాయెల్ ఇంటెలిజన్స్ ప్రధాన కార్యాలయం షైన్‌బెట్‌పై దాడి చేశారు. ఈ దాడిలో 92 మంది ఇజ్రాయెల్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తామే చేసినట్లు షియా ఇస్లామిస్టులు ప్రకటించుకున్నారు. ఆ తర్వాత వారంతా హిజ్‌బొల్లాగా ఏర్పాటయ్యారు.

అప్పటినుంచి హిజ్‌బొల్లా, ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం కొనసాగుతూనే ఉంది. హిజ్‌బొల్లా తొలినాళ్లలో తన బలం పెంచుకునేందుకు ఇరాన్‌తో చేతులు కలిపింది.  ఇరాన్ అండదండలతో ఇజ్రాయెల్‌కు హిజ్‌బొల్లా  బలీయమైన శత్రువుగా మారింది.1980, 1990 మధ్య కాలంలో బీరూట్‌లోని అమెరికా, ఫ్రాన్స్ మిలిటరీ స్థావరాలపై లెక్కలేనన్ని సార్లు దాడులు చేసింది.

ఇరాన్ మాత్రమే కాకుండా పలు దేశాలు ఇప్పటికీ హిజ్‌బొల్లాకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయి. ఓ ప్రాంతానికే పరిమితమైన హిజ్‌బొల్లా 1990లో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఆ ఏడాది హిజ్‌బొల్లా నేత అబ్బాస్ అల్ ముసావిని ఇజ్రాయెల్ హతమార్చింది. దీనికి ప్రతీకారంగా అర్జెంటీనాలోని ఇజ్రాయెల్ ఎంబసీతో పాటు యూదుల కమ్యూనిటీ సెంటర్‌పై హిజ్‌బొల్లా  దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 

హిజ్‌బొల్లానుంచి ఎన్నిసార్లు ప్రతిఘటనలు ఎదురైనా ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ మాత్రం గుట్టుచప్పుడు కాకుండా ఆ సంస్థ కీలక నేతలను మట్టుబెడుతూనే ఉంది. కానీ హిజ్‌బొల్లా మిలిటరీ కమాండర్ ఇమాద్ ముగ్నియేను అంతమొందించడం సాధ్యం కాలేదు. 2008లో డమాస్కస్‌లో కారుబాంబు దాడిలో ముగ్నియేను అంతమొందించడానికి విఫలయత్నం చేసింది. అప్పటినుంచి ఇజ్రా యెల్‌పై హిజ్‌బొల్లా దాడులు కూడా ఉధృతమయ్యాయి.

తాజాగా ఓ పక్క ఇజ్రాయెల్‌తో యుద్ధం చేస్తున్న హమాస్‌కు మద్దతు పలుకుతూనే లెబనాన్ సరిహద్దుల్లోని ఇజ్రాయెల్ ప్రాంతాలపై విరుచుకుపడింది.వాటి ఫలితమే ఇటీవల జరిగిన పేలుళు.్ల ఈ పేలుళ్లకు ఇజ్రాయెల్ కారణమని ఆరోపించిన హిజ్‌బొల్లా కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఫలితంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడ్డాయి. ఈ ఘర్షణల నేపథ్యంలో పశ్చిమాసియాకు అదనపు బలగాలను పంపాలని అమెరికా నిర్ణయించింది.

ఈ యుద్ధం తీవ్రరూపం దాల్చి ఎటు దారితీస్తుందోనని ఐక్యరాజ్యసమితి సైతం ఆందోళన చెందుతున్నది. ఈ యుద్ధం పశ్చిమాసియాలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ప్రమాదముందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే ప్రపంచ దేశాలు మరోసారి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది.