బెల్లంకొండతో అనుపమ?

30-04-2024 12:05:00 AM

‘టిల్లు స్కేర్’ హడావిడి ముగిసేలోపే మరోకొత్త పాత్రకి ‘పరదా’ తీసింది అనుపమ పరమేశ్వరన్. తాను నటించే కథలు, పాత్రల్లో భిన్నత్వం కోరుకునే అనుపమ అతి త్వరలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఆడిపాడనుంది. ‘చావు కబురు చల్ల గా’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన కౌశిక్ పెగళ్లపాటి, బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకడిగా ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించనున్న ఈ సినిమాని శ్రీరామనవమి నాడు ప్రకటించారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలలో భాగంగా హీరోయిన్ ఎంపికపై దృష్టి సారించి న చిత్ర బృందం తమ ఓటు అనుపమకు వేసినట్టు సమాచారం. సినిమా ప్రకటనతో వెలువడిన పోస్టర్‌లో రాముడు బాణం ఎక్కుపెడుతూ ఉండటం అందరి దృష్టినీ ఆకర్షించింది. మరో ఆసక్తికర విషయమేమిటంటే.. ఈ చిత్రంలో వానర మూకకి సంబంధించి కొంత ప్రస్తావన ఉందట. అందువలన ఈ సినిమాకి ‘కిష్కింధ పురి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారట దర్శక నిర్మాతలు. హారర్ నేపథ్యంలో రానున్న ఈసినిమాకి ‘కాంతార’ ఫేమ్ బి.అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. ఇంతకుముందు కూడా రెగ్యులర్  హీరో  హీరోయిన్ ఫార్ములాకి భిన్నంగా ‘రాక్షసుడు’ సినిమాలో కలిసి నటించిన అనుపమ, బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి ఈ విభిన్నమైన చిత్రం కోసం తెర పంచుకోనుండటం విశేషం.