27-09-2025 12:00:00 AM
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘అవతార్’. ఈ ఫ్రాంచైజీ నుంచి మూడోభాగంగా రూపుదిద్దుకుంటోంది ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’. ఇప్పటికే ఈ మూవీ ట్రైల ర్ విడుదలై, సినిమాపై అంచనాలు పెంచేలా చేసింది. తాజా గా మరో ట్రైలర్ శుక్రవారం రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ తెలుగు వెర్షన్లోనూ రూపొందించటం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించింది. కామెరూన్ ఈసారి యాష్ పీపుల్ అనే భయంకరమైన అగ్ని గిరిజన తెగను పరిచయం చేశారు.
ఇది అగ్నిని ఆరాధిస్తూ.. భీకరమైన యుద్ధానికి సిద్ధపడే తెగగా పరిచయం చేశారు. ‘ఇది ఈ లోకంలో అన్నిటికంటే స్వచ్ఛమైనది.. కొండల మీద అగ్గి పుట్టింది. అది మా కోనల్ని బూడిద సేసింది. కాపాడమని మావాళ్లు మొత్తుకున్నారు. కానీ ఎవా పలుకలేదు’ అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్లో డైలాగులు ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నాయి. ‘నాన్న ఎప్పుడూ ఏమంటాడు..?’, ‘సల్లీస్ ఎప్పుడూ కలిసే ఉండాలి’, ‘అది కాదు ఇంకోటి..’, ‘సల్లీస్ ఓటమి ఒప్పుకోరు’ వంటి డైలాగులు ఆకట్టుకుంటాయి. డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది.