17-10-2025 06:13:32 PM
కుభీర్,(విజయాక్రాంతి): పత్తి రైతులు తమ పంటను కనీస మద్దతు ధర (MSP)కు నేరుగా, మధ్యవర్తులు లేకుండా విక్రయించుకునేందుకు “కపాస్ కిసాన్ యాప్” ఎంతో ఉపయోగకరమని సోనారి క్లస్టర్ వ్యవసాయ విస్తీర్ణ అధికారి ఎం. నారాయణ తెలిపారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని సోనారి క్లస్టర్లోని హోపోలి, గోడాపూర్ గ్రామాల రైతులకు ఆయన యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ యాప్ ద్వారా రైతులు స్లాట్ బుకింగ్, పేమెంట్ ట్రాకింగ్, ఆధార్ మరియు భూమి రికార్డుల ఆధారంగా నమోదు చేసుకోవచ్చు. మార్కెట్లో రద్దీని తగ్గించేందుకు స్లాట్ బుకింగ్ సదుపాయం ఉండగా, లావాదేవీల్లో పారదర్శకత కోసం పేమెంట్ ట్రాకింగ్ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ప్లేస్టోర్ నుండి యాప్ను డౌన్లోడ్ చేసి, ఆధార్, పట్టాదారు పాస్బుక్, పంట రకం, విస్తీర్ణం వంటి వివరాలు నమోదు చేయాలని, తరువాత కావలసిన మార్కెట్లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక పత్తి రైతులు పాల్గొన్నారు.