11-07-2025 11:12:44 PM
ములుగు,(విజయక్రాంతి): మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల గురించి మహిళా సంఘాల సభ్యులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. ఆదేశాల మేరకు డీఆర్డీఓ సంపత్ రావు, జిల్లా పౌర సంబంధాల అధికారి యం.డి రఫీక్ నేతృత్వంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందాలు మహిళా సాధికారత కార్యక్రమాల గురించి తమ ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పిస్తున్నాయి.
ఇందులో భాగంగా శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలోని వెంకటపూర్ మండలంలోని లక్ష్మిదేవిపేట,ఏటూరునాగారం మండల కేంద్రంలో బోడ కిషన్ కో ఆర్డినేటర్ బృందం చే కళాజాత ప్రదర్శనలు నిర్వహించారు. వడ్డీ లేని రుణాలు,మహిళా సాధికారత,ఉచిత బస్సు ప్రయాణం,ఆరు గ్యారంటీల అమలు, మహిళా శక్తి కాంటీన్ లు, పెట్రోల్ బంకుల నిర్వహణ,సోలార్పవర్ యూనిట్లు తదితర వాటిపై అవగాహన కల్పించారు.