08-08-2025 12:15:15 AM
భద్రాచలం, ఆగస్టు 7, (విజయ క్రాంతి): ఆదివాసి గిరిజన గ్రామాలలోని గిరిజన గర్భిణీ స్త్రీలకు తల్లిపాల ప్రాధాన్యతపై తెలియజేసి పుట్టిన బిడ్డకు పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించేలా అవగాహన కల్పించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ అన్నారు. గురువారం భద్రాచలం సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు 2025 కార్యక్రమంలో భాగం గా ఏర్పాటు చేసిన సమావేశానికి భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, సబ్ కలెక్టర్ మ్రీణాలి శ్రేష్టతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఈనెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో గర్భిణీ స్త్రీలకు తల్లిపాల విశిష్టతపై, గర్భిణీ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారని ఆయన అన్నారు. అనంతరం భద్రాచలం శాసనసభ్యులు మాట్లాడు తూ జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వారోత్సవాలలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల సిబ్బంది,
ఆశాలు, స్వయం సహాయక సంఘాలు, ఎన్జీవోలు, డి ఆర్ డి ఏ, లైన్ డిపార్ట్మెంట్లు, సిబ్బంది భాగస్వామ్యంతో గిరిజన గ్రామాలలో తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు ఒకటి నుండి జరుగుతున్నాయని అన్నారు. గర్భిణీ మహిళలు ప్రసవం అయిన తర్వాత బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రిపాలు ఆ శిశువుకు తాగించాలని, బిడ్డకు ఆ పాలు దివ్య ఔషధంగా పనిచేస్తుందన్నారు.
అనంతరం 15 మంది గర్భిణీ స్త్రీలకు బాలామృతం అందించి ఐసిడిఎస్ ఆధ్వర్యంలో మహిళలకు సీమంతం నిర్వహించారు. డిడబ్ల్యుఓ స్వర్ణలత లేనిన, సిడిపిఓ జ్యోతి, సూపర్వైజర్లు అనసూర్య, చంద్రకళ వివిధ గ్రామాల నుండి వచ్చిన గర్భిణీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.