13-11-2025 07:51:22 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద ఎల్ పి జి గ్యాస్ లబ్ధిదారుల ఎంపికపై విస్తృత అవగాహన చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భావన సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాలతో కలిసి ప్రధానమంత్రి ఉజ్వల పథకంపై పౌరసరఫరాల శాఖ అధికారులు, తహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, రవాణా, వ్యవసాయ, మత్స్య శాఖల అధికారులు, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద పేదవారికి ఉచితంగా ఎల్. పి. జి. గ్యాస్ సిలిండర్లు అందిస్తుందని, అర్హులైన వారిని గుర్తించడంలో సంబంధిత శాఖల అధికారులు విస్తృతంగా అవగాహన పరచాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళ సభ్యుల ద్వారా గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని, ఉజ్వల సిలిండర్ అనర్హుల చేతిలో ఉంటే సమగ్ర విచారణ జరిపి తొలగించాలని, ఆదాయం, భూ విస్తీర్ణం, వాహనాలు కలిగిన యజమానుల వివరాలు సేకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వసంతలక్ష్మి, రవాణా శాఖ అధికారి రామ్ చందర్, వ్యవసాయ శాఖ అధికారి వెంకటి, మత్స్యశాఖ అధికారి సాంబశివరావు, తహసిల్దార్లు, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.