13-11-2025 07:53:02 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని బురదగూడం మదర్సా ఎదురుగా గల జాతీయ రహదారిపై ఆటో ట్రాలీ, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో తండ్రి మృతిచెందగా కుమారుడు గాయపడ్డారు. పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బొక్కలగుట్టకు చెందిన ఒళ్లపు నర్సయ్య తన కుమారుడు వెంకటేష్తో కలిసి ద్విచక్ర వాహనంపై పని నిమిత్తం బొక్కలగుట్ట నుండి మంద మర్రికి వస్తుండగా బురద గూడెం మదర్సా సమీపంలోకి రాగానే రాంగ్ రూట్లో, అతి వేగంగా, అజాగ్రత్తగా వచ్చిన ఆటో ట్రాలీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఒళ్లపు నర్సయ్య తలకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలు కాగా వెంటనే ఆయన్ని అంబులెన్స్ ద్వారా మంచిర్యాల లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధృవీకరించారు. కాగా ఈ ప్రమాదంలో మృతుడి కుమారుడు వెంకటేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతునికి భార్య, కుమారుడు,కూతురు ఉన్నారు. మృతుని భార్య లత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.