07-01-2026 06:54:50 PM
చివ్వెంల,(విజయక్రాంతి): తెలంగాణ గిరిజన ఉపసర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా బానోతు సురేష్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని 60 ఫీట్ల రోడ్డులో ఉన్న ఏఎఫ్వో కన్సల్టెన్సీ కార్యాలయంలో లంబడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు దారావత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన గిరిజన ఉపసర్పంచుల సంఘం సభ్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సూర్యాపేటకు వచ్చిన నూతనంగా ఎన్నికైన గిరిజన ఉపసర్పంచులు సమావేశమై తెలంగాణ గిరిజన ఉపసర్పంచుల సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షులుగా బానోతు సురేష్ నాయక్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన రాష్ట్ర అధ్యక్షులు బానోతు సురేష్ నాయక్ మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన గిరిజన నాయకులకు ఎల్లవేళలా రుణపడి ఉంటానన్నారు.
త్వరలోనే జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలతో పాటు వివిధ అనుబంధ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నూతనంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర గిరిజన ఉపసర్పంచులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఉపసర్పంచులకు సర్పంచుల మాదిరిగానే గౌరవ వేతనం అందించాలని, గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం పాల్గొనేలా చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.