29-09-2025 05:33:28 PM
గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ హెచ్చరిక
పెద్దపల్లి (విజయక్రాంతి): గోదావరిఖని, గోదావరి నది ఉధృతంగా, ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో బతుకమ్మ నిమజ్జనం కోసం నదికి రావద్దని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, 2- టౌన్ సీఐ ప్రసాద్ రావు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. గోదావరిఖనిలో గోదావరి నది నీటి ప్రవాహం పెరిగిపోవడంతో, నదిలో నిమజ్జనం చేయడం సురక్షితం కాదని, ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొని గోదావరిలో బతుకమ్మ నిమజ్జనాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ మేరకు గోదావరి ఒడ్డు ప్రాంతాల్లో నిషేధానికి సంబంధించిన హెచ్చరికలతో కూడిన ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఎవరు గోదావరి వద్దకు బతుకమ్మ నిమజ్జనం కోసం రావద్దని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని అధికారుల సూచనలను గౌరవించాలని, ప్రత్యామ్నాయంగా ఇతర సురక్షిత ప్రదేశాల్లో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఏసీపీ విజ్ఞప్తి చేశారు.