01-11-2025 12:00:00 AM
-రెండో టీ20లో భారత్ ఓటమి
-ఆసీస్ పేస్ దెబ్బకు బ్యాటర్లు విలవిల
-సిరీస్లో ఆస్ట్రేలియాకు 1 ఆధిక్యం
మెల్బోర్న్, అక్టోబర్ 31 : ఎంతలోనే ఎంత తేడా.. కాన్బెర్రాలో ఆడింది కొద్దిసేపే అయినా మెరుపులు మెరిపించిన మన బ్యా టర్లు అసలైన పేస్ పిచ్పై మాత్రం బ్యాట్లెత్తేశారు. మెల్బోర్న్ పిచ్ను అర్థం చేసు కోకుండా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నారు. పేస్ పిచ్ లపై ఆడడం కొత్త అన్నట్టుగా మన బ్యాటర్ల ఆట కనిపించింది.టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఊహించినట్టుగానే భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.
పిచ్కు పేస్కు అనుకూలిస్తుందన్న అంచనాల మధ్య ఆసీస్ బౌలర్లు చెలరే గిపోయారు. ఫలితంగా భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. అభిషేక్ శర్మ తప్పిస్తే మిగిలిన వారంతా ఇలా వచ్చి అలా వెళ్లారు. గిల్(5), సంజూ శాంసన్(2), సూర్యకుమార్(1),తిలక్ వర్మ(0), అక్షర్ పటేల్(7) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. దీంతో భారత్ కేవలం 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. దీంతో కనీసం 100 స్కోరైనా చేస్తుందా అన్న అనుమానాలు వచ్చాయి. ఈ దశలో అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా జట్టును ఆదుకున్నారు.
టీ20ల్లో తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ అభిషేక్ హాఫ్ సెంచరీ బాదాడు. అటు రెండో వన్డేలో బ్యాట్తో మెరుపులు మెరిపించిన హర్షిత్ రాణా(34) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ ఆరో వికెట్కు 56 పరుగులు జోడించారు. వీరి పార్టనర్షిప్తోనే కనీసం 125 పరుగులకు భారత్ ఆలౌటైంది. అభిషేక్ శర్మ 37 బంతుల్లో 68 (8 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేశాడు.భారత్ ఇన్నింగ్స్లో ఎనిమిది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్కే వెనుదిరిగారు. ఆసీస్ బౌలర్లలో హ్యాజిల్వుడ్ (3/13), బార్ట్ లెట్ (2/39), నాథన్ ఎల్లిస్ (2/21) రాణించారు.
పిచ్ పేసర్లకు అనుకూలంగానే ఉన్నప్పటకీ టార్గెట్ చిన్నదే కావడంతో ఆస్ట్రేలియా దూకుడుగానే ఆడింది. ఓపెనర్లు హెడ్, మార్ష్ తొలి వికెట్కు 4.3 ఓవర్లలోనే 51 పరుగులు జో డించారు. మార్ష్ 46(26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు), హెడ్ 28(15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడారు. తర్వాత టిమ్ డేవిడ్ (1) నిరాశపరిచినా జోస్ ఇంగ్లీ స్(20), మిఛెల్ ఓవెన్(14) రాణించారు. ఆసీస్ చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయినప్పటకీ అప్పటికే విజయం ఖాయమైంది.
చివరికి కంగారూలు 13.2 ఓవర్లలో 6 వికె ట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. బుమ్రా (2/26),వరుణ్ చక్రవర్తి (2/23),కుల్దీప్ (2/45) రాణించారు. హ్యాజిల్వుడ్కు ప్లేయ ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ విజయంతో ఐదు టీట్వంటీల సిరీస్లో ఆసీస్ 1 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్లో మూడో టీ ట్వంటీ ఆదివారం హోబార్ట్లో జరుగుతుంది.