26-09-2025 01:12:05 AM
-గ్రామాలలో ఆశావాహుల అనుచరుల మధ్య బెట్టింగ్ల పోటీ
-రిజర్వేషన్ల ఖరారు పైనే ఆధారం
-స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆశావహుల తహతహ
కామారెడ్డి, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరతులు జోరుగా చేపట్టింది. రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తిచేసి స్థానిక అధికారులు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదించారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కసరతులు నిర్వహిస్తుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో రిజర్వేషన్ల బెంగ పట్టుకుంది.
దీనికి తోడు వారి అనుచరులు తమ నాయకునికి అనుకూలంగా రిజర్వేషన్ కలిసి వస్తుంది జోరుగా బెట్టింగులు కడుతున్నారు. పార్టీలకతీతంగా తమ అనుచరునికి రిజర్వేషన్ కలిసి వస్తుందని మద్దతు ఇవ్వాలంటూ ఇప్పటినుంచే అభ్యర్థుల అనుచరులు కోరుతున్నారు. మరికొందరు అనుచరులు బెట్టింగ్లు క కడుతున్నారు. ప్రతి పల్లెలో సైతం రిజర్వేషన్లపై చర్చ జరుగుతుంది. గతంలో వచ్చిన రిజర్వేషన్లు మళ్ళీ రావంటూ కొందరు, మరికొందరు గతంలో వచ్చిన రిజర్వేషన్లే వస్తాయంటూ పుకార్లు సృష్టిస్తున్నారు. దీంతో పోటీకి నిలబడే నాయకుల అనుచరులు బెట్టింగులకు పాల్పడుతున్నారు.
గ్రామాల్లో బెట్టింగ్ల జోరు
కామారెడ్డి జిల్లాలో 533 గ్రామపంచాయతీలు ఉన్నాయి, 25 జెడ్పిటిసి స్థానాలు, 25 ఎంపీపీ స్థానాలు ఉన్నాయి. వీటన్నిటికీ గ్రామాల నుంచి స్థానిక సంస్థల లో పోటీ చేసినందుకు ఆశావాహులు రిజర్వేషన్ల ఖరారుపై ఉత్కంఠతో ఉన్నారు. దీంతో వారి అనుచరులు తమ నాయకుని కి రిజర్వేషన్ కలిసి వస్తుంది అని బెట్టింగులు కడుతున్నారు. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు బెట్టింగ్ల జోరు కొనసాగుతుంది. రిజర్వేషన్ల ఖరారు వరకు బెట్టింగ్ల జోరు రోజురోజుకు పెరుగుతున్నాయి. బెట్టింగ్లలో ఎవరు గెలిస్తే వారు డబ్బులు తీసుకోవడమే కాకుండా బెట్టింగ్ కట్టిన వారికి విందు ఏర్పాటు చేయాలంటూ కండిషన్లు పెట్టుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్ల కసరత్తు పూర్తి చేసి ప్రభుత్వానికి ఇటీవలే నివేదించింది. స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి.
ఆశావాహులకు రిజర్వేషన్ల బెంగ
రిజర్వేషన్లు తయారుచేసి ప్రభుత్వానికి నివేదించామని అధికారులు చెబుతుండడంతో ఆశావాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నికల్లో నిలబడి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడమే కాకుండా ప్రజలకు సేవ చేయాలని భావం గల యువత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. గ్రామాలలో తమ అనుచరులను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా కుల సంఘాలు, యువజన సంఘాలు వారిని కూడా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఆశావాహులు ఇప్పటినుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
రిజర్వేషన్లు కలిసి వస్తేనే పోటీ చేసేందుకు అవకాశం ఉండడంతో సర్పంచ్ ఎన్నికల్లో ఒకరికి అవకాశం వస్తే ఎంపిటిసి ఎన్నికల్లో మరొకరికి అవకాశం రిజర్వేషన్ కలిసి వస్తుందని అంటూ బేరసారాలు కుదుర్చుకుంటున్నారు. అంతేకాకుండా ఒకరికి ఒకరు ఎవరికి రిజర్వేషన్ వస్తే వారు పోటీ చేస్తే మిగతా వారు మద్దతు ఇవ్వడమే కాకుండా గెలుపు కోసం కృషి చేద్దామంటూ మాటలు తీసుకుంటున్నారు. ఆశావాలకు రిజర్వేషన్ల బెంగ పట్టుకుంది.
గ్రామాల్లో స్థానిక సంస్థలపై వేడిగా చర్చలు
త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పాటు రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయిందని ప్రభుత్వానికి నివేదించామని అధికారులు చెబుతుండడంతో ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులు కనిపిస్తే చాలు నీకే ఓటేస్తాం నువ్వే నిలబడు అంటూ యువకులు, వృద్ధులు ఆశ వాహూలకు భరోసా కల్పిస్తున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన పోటీలో ఎక్కువమంది ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏకగ్రీవంగా ఎన్నికల పరిస్థితులు లేవు. స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్లపై గ్రామాలలో చరితలు జోరుగా జరుగుతున్నాయి.
ప్రభుత్వం ప్రకటిస్తే చాలు ఎన్నికలే
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించిన ఎన్నికల ప్రక్రియకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నిక నోటిఫికేషన్ ఎప్పుడు వస్తే అప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ప్రభుత్వంనుంచి ఆదేశాలు రాగానే ఎన్నికలు నిర్వహించేందుకు పంచాయతీ అధికారులు సిద్ధంగా ఉన్నారు.
- మురళి, జిల్లా పంచాయతీ అధికారి, కామారెడ్డి