23-05-2025 01:17:16 AM
సిద్దిపేట, మే 22 (విజయక్రాంతి): భారతదేశ చరిత్రలో అణగారిన వర్గాల కోసం నిరంతరం కృషి చేసిన తెలంగాణ తొలి దళిత కిరణం భాగ్యరెడ్డి వర్మ అని సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. గురువారం రాయపోల్ మండలం కేంద్రంలో భాగ్యరెడ్డివర్మ 137వ జయంతి సందర్భంగా నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమ సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తూ తోటి సమాజంతో ఆత్మగౌరవంగా జీవించడానికి నడుం బిగించిన మహనీయులు భాగ్యరెడ్డి వర్మ అన్నారు. సామాజిక న్యాయం కోసం తొలి పునాది రాయి వేసి తన ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేశారని చెప్పారు. నిజాం ప్రభుత్వ హాయంలో ఉర్దూ మీడియం పాఠశాలలు కొనసాగుతుండగా, బాలికల కోసం 1924లో 26 తెలుగు మీడియం పాఠశాలలు ప్రారంభం చేసిన గొప్ప త్యాగశీలిగా వివరించారు.
నేటి దళిత, బహుజనుల అందరూ ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉంద న్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పుట్ట రాజు, కోశాధికారి మహమ్మద్ ఉమర్, ఇమ్రాన్, ఇంతియాజ్ పాల్గొన్నారు.