26-11-2025 12:00:00 AM
హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈక్రమంలోనే మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు, గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ నేతలకు రాంచందర్ రావు దిశానిర్దేశం చేశారు.
స్థానిక సంస్థ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిం చారు. అన్ని వార్డులు, గ్రామ పంచాయతీల కు పోటీ చేయాలని నిర్ణయించారు. పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగేలా కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఫ్లోర్ లీడర్లతో కమిటీ వేయనున్నారు. రాష్ట్ర , జిల్లా స్థాయి కమిటీలతోపాటు లీగల్ కమిటీలు వేయనున్నారు.
30న రాష్ట్రానికి బీఎల్ సంతోష్
తెలంగాణకు సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఈ నెల 30న రానున్నట్లు తెలుస్తోంది. బీజేపీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరు కాబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
సమావేశానికి కీలక నేతలు డుమ్మా
స్థానిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి ముఖ్యమైన నేతలు డుమ్మా కొట్టారు. అందరూ హాజరు కావాలని రాంచందర్ రావు పేరుతో అఫిషియల్గా ప్రతి ఒక్క నేతకు సమాచారం ఇచ్చినా కొంత మంది నేతలు దాన్ని లెక్కలోకి తీసుకోకపోవడం గమనార్హం. అయితే సమావేశానికి హాజరైన వారిలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సైదిరెడ్డి తప్ప పెద్దగా మిగిలిన కీలక నేతలెవరూ హాజరు కాలేదు.