27-01-2026 01:07:14 AM
ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి వెల్లడి
హైదరాబాద్, జనవరి 26 (విజయక్రాంతి): రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల సాధనకు తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, అంజిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా గళమెత్తి, రిటైర్డ్ ఉద్యోగుల న్యాయమైన హక్కులను సాధించుకుందామని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్సీలు కొమరయ్య, అంజిరెడ్డి కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. గత 18 నెలలుగా సుమారు 18 వేల మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు పెండింగ్లో ఉంచటం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.
జీపీఎఫ్ నుంచి గ్రాట్యూటీ వరకు అన్నీ బకాయిలేనని, జీపీఎఫ్, జీఐఎస్, ఓపీఎస్, లీవ్ ఎన్క్యాష్మెంట్, గ్రాట్యూటీ వంటి కీలక రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో విడుదల కాకపోవడంతో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో బీజేపీ జనరల్ సెక్రటరీ అశోక్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ధర్నాకు టీపీయూఎస్ (తపస్) రాష్ట్ర శాఖ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు వొడ్నాల రాజశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య తెలిపారు.