23-08-2025 12:00:00 AM
త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు అధికారికంగా ప్రకటన
ఆర్మూర్ ఆగస్టు 22 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రానికి చెందిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు విజయభారతి శుక్రవారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె, కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతు బంధు, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాల అమలులో లోపాలు, రైతులకు తగిన న్యాయం జరగకపోవడం వల్ల ప్రజలు నిస్సహాయ పరిస్థితి ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
పార్టీతో వ్యక్తిగత విభేదాలు లేవు. కానీ ప్రజల సంక్షేమమే నా ధ్యేయం. అందుకే బీఆర్ఎస్ వైపు అడుగు వేస్తున్నాను అని విజయభారతి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పోషించిన పాత్రను గుర్తుచేసుకుంటూ, ఆయన పాలనలోనే ప్రజలకు సంక్షేమం అందుబాటులోకి వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఈనెల 25న హైదరాబాద్లో జరగనున్న బీఆర్ఎస్ భారీ సభలో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ సమక్షంలో తాను అధికారికంగా పార్టీలో చేరనున్నట్లు విజయభారతి తెలిపారు. గతంలో బీజేపీ కోసం విస్తృత స్థాయిలో శ్రమించిన ఆమె, త్వరలో కొత్త రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించనున్నారు.