23-08-2025 01:21:11 AM
కామారెడ్డి,(విజయక్రాంతి): గ్రామాల్లో తిరుగుతుంటే ప్రజల కళ్లలో ఆనందం కనిపిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలేనని పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. సర్దపూర్ తండాలో రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనం, నెమలిగుట్ట తండాలో రూ.12 లక్షలతో అంగన్వాడీ భవనం, మర్రి తండాలో రూ.20 లక్షలతో నిర్మించనున్న జీపీ భవనానికి శంకుస్థాపన నిర్వహించారు.
గుంటి తండాలో రూ.20 లక్షలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనం, వడ్డెర కాలనీలో రూ.20 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనం, వెనుక తండాలో రూ.12 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ భవనం, పాల్వంచ మండలం వాడి గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించనున్న జీపీ భవన నిర్మాణాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందిరమ్మ ఇళ్లకు మంజూరు పత్రాలు..
ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, ఆహార భద్రత కార్డులను షబ్బీర్ అలీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు తీవ్ర మనోవేదనకు గురయ్యారన్నారు. సమస్యలు చెప్పుకుందామంటే నాయకులు గ్రామాల్లోకి వచ్చేవారు కాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్కరేషన్ కార్డు ఇవ్వలేదని.. పేదలకు ఇల్లు రాలేదని, బీఆర్ఎస్ నాయకులు మాత్రం లక్షాధికారులయ్యారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం..
కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వమని, పేదల అభ్యున్నతికి కృషి చేస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి పేదల ప్రజల పక్షాన పోరాటం చేస్తూ వారికోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని స్పష్టం చేశారు.
9 రోజుల్లో రూ.9వేల కోట్లు..
తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్లు రైతు భరోసా అందించి రైతులను ఆదుకున్నామని షబ్బీర్అలీ స్పష్టం చేశారు. నిరుపేదలకు నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు పేదల కోసం ఉన్నాయని తెలిపారు.