30-05-2025 12:44:19 AM
- సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి
- యురేనియం కోసమే నక్సల్స్పై దాడి
- ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
మునుగోడు, మే 29 : దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషించడమే తప్ప దేశ ప్రజల సమస్యలు బిజెపి ప్రభుత్వానికి పట్టవని సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి ఆరోపించారు. గురువారం సిపిఐ 15వ మహాసభను మండలంలోని సింగారం గ్రామంలో ఏర్పాటు చేశారు.ఈ మహాసభకు ఆయనతోపాటు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హాజరయ్యారు.
ముందుగా అమరజీవి కామ్రేడ్ జినుకుంట్ల సాయిలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండా ను ఆవిష్కరించి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మహాసభలో పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో బీజేపీ ఎంఐఎం సహకారంతోనే మూడోసారి అధికారంలోకి వచ్చిందని, ఎంఐఎం పార్టీకి బిజెపికి లోపాయికరంగా ఒప్పందాలు ఉన్నాయన్నారు.
అనంతరం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. ఖమ్మం భద్రాచలం చత్తీస్గడ్ అడవులలో యురేనియం తవ్వకాల కోసం అడవిలో ఉన్న నక్సల్స్ను ఏకతాటిగా బిజెపి ప్రభుత్వం హతం చేస్తున్నారని ఆరోపించారు. నక్సల్స్ని హతమార్చకుండా ప్రజా సంఘాలతో బిజెపి ప్రభు త్వం చర్చలు జరపాలన్నారు.
గత 12 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్పొరేట్ సంస్థలను సపోర్ట్ చేస్తూ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతుందని అన్నారు. దేశంలో ఉన్న మౌలిక సమస్యలు నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేయకుండా సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా మత విద్వేషాల పరిపాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు.
రైతులకు వ్యతిరేకంగా బిజెపి ప్రభుత్వం వ్యవసాయ చట్టా లు తీసుకువస్తే దేశవ్యాప్తంగా రైతాంగం కదిలి ఢిల్లీలో ఆరు నెలల పాటు ధర్నాలు రాస్తారోకాలు చేయడం వల్ల మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసిందని గుర్తు చేశారు.
మండల కార్యవర్గ సభ్యుడు ఉప్పునూతల రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ మండల మహాసభలో ప్రజానాట్యమండలి రాష్ర్ట కార్యదర్శి కురుమిద్ది శ్రీనివాసులు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురుజ రామచంద్రం, బులుగురి నరసింహ, తీర్పారి వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు సురిగి చలపతి, బొమ్మర గోని లాలయ్య, సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, మాజీ జెడ్పిటిసి గోస్కొండ లింగయ్య, మండల సహాయ కార్యదర్శి పాండు, మండల కార్యవర్గ సభ్యులు బండమీది యాదయ్య, దుబ్బ వెంకన్న, ఈదులకంటి కైలాస్, వనం వెంకన్న, ఎండి జానీ, వంశీకృష్ణ, శంకర్ ఉన్నారు.