27-09-2025 02:32:42 PM
అదిలాబాద్, (విజయక్రాంతి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రలో కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji)కి ప్రత్యేక గుర్తింపు ఉందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి సందర్భంగా శనివారం బోథ్ మండలంలోని దన్నుర్ (బి) గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ అడుగుజాడల్లో నడవాలని ఆయన చూపిన ఉద్యమ స్ఫూర్తిని అందరం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.