12-05-2025 02:36:01 AM
న్యూఢిల్లీ, మే 11: భారత సైన్యం తన అమ్ములపొదిలోని తిరుగులేని అస్త్రమైన బ్రహ్మోస్ క్షిపణిని వినియోగించి పాక్ దాడులను తిప్పికొట్టింది. పాకిస్థాన్ వైమానిక దళం (పీఏఎఫ్) కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ క్షిపణిని ప్రయోగించింది. అలా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా పాకిస్థాన్లోని ఎనిమిది స్థావరాలను ధ్వంసం చేసింది.
ఈ దెబ్బతో ‘బ్రహ్మోస్ క్షిపణులనే మనం ఎదుర్కోలేకపోతున్నాం.. అంటే.. ఇక భారత్ అణ్వాయుధాలు తీస్తే పరిస్థితేంటి?’ అనే ఆలోచన పాక్లో కలిగింది. ఈనెల 10వ తేదీ తెల్లవారుజామున భారత వైమానిక దళం పాకిస్థాన్ అడ్మినిస్ట్రేషన్ నగరమైన రావల్పిండిని టార్గెట్ చేసింది. చక్లారా, పంజాబ్ ప్రావీన్స్ సర్గోధా వద్ద బ్రహ్మోస్ ప్రయోగించింది.
కాగా, యుద్ధ విరమణకు కొద్ది గంటల ముందు దాయాదికి మన సైన్యం లాస్ట్ పంచ్ ఇచ్చింది. ఏకంగా ఆరు పాకిస్థానీ వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. వీటితో పాటు మరో రెండుచోట్ల రాడార్ వ్యవస్థలను సైతం ధ్వంసం చేసింది. శుక్రవారం రాత్రి దాటాక వాటిపై అత్యంత కచ్చితమైన వైమానిక దాడులతో పాక్ను కోలుకోలేని దెబ్బ కొట్టింది.
హ్యామర్ గైడెడ్ బాంబులు, స్కాల్స్ క్షిపణులు, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి, లాయిటరింగ్ కమ్యూనికేషన్ను వాడి అక్కడి వైమానిక స్థావరాలు, కమాండ్ సెంటర్లు, రాడార్ సైట్లు, ఆయుధ నిల్వ కేంద్రాలను ధ్వంసం చేసింది. అయితే.. బ్రహ్మోస్ క్షిపణిని భారత్ వినియోగించడం ఇదే మొదటిసారి. భారత్ చేస్తున్న దాడుల్లో ఏ ఒక్కదాన్ని పాక్ సైన్యం అడ్డుకోలేకపోయింది. పాక్ భద్రత వ్యవస్థ అంత్యంత పేలవమైందని ఈ దెబ్బతో ప్రపంచానికి తెలిసింది.