13-12-2024 02:40:02 AM
హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): ఈ నెలాఖరులోగా రాష్ట్ర మంత్రి వర్గాన్ని విస్తరించనున్నట్టు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో చిట్చాట్లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వే శరవేగంగా సాగుతుందని చెప్పారు. ఇప్పటివరకు 2.32 లక్షల ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే పూర్తయ్యిందని వెల్లడించారు.
ప్రజాపాలనలో ఇంది రమ్మ ఇంటికోసం దరఖాస్తు చేసుకోని వా రు సైతం ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. సంక్రాంతి లోపు వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరిస్తామని స్పష్టంచేశారు. తెలంగాణ తల్లి విగ్రహంపై జవాబు లేకనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని ఎద్దేవాచేశారు.
అసెంబ్లీకి వచ్చి కొత్త ఆర్వోఆర్ చట్టంపై ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని సూచించారు. రైతులకు బేడీలు వేయడం సరికాదని అన్నారు. గత ప్రభుత్వ తప్పులే నేడు ప్రభుత్వ హాస్టల్స్, గురుకులాలు, పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలకు కారణమవుతున్నాయని ఆరోపించారు.