23-09-2025 12:40:02 AM
ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య
నాగార్జునసాగర్, సెప్టెంబర్ 22: బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ టూరిజం బుద్ధవనం లో ఈనెల 23వ తేదీన అనగా మంగళవారం నాడు సాయంత్రం 5 గంటలకు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నామని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 21 నుండి 30వ తేదీ వరకు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తుంది .
దీనిలో భాగంగా సంస్కృతి సాంప్రదాయం అయిన బతుకమ్మ పండుగను పురస్కరించుకొని బుద్ధవనంలో నిర్వహించే బతుకమ్మ సంబరాలకు నందికొండ మున్సిపాలిటీలోని ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రపంచ పర్యాటక కేంద్రమైన బుద్ధవనంలో బతుకమ్మ సంబరాలలో పాల్గొని తెలంగాణ సంస్కృతి అయిన బతుకమ్మ పండుగను ప్రపంచస్థాయిలో ప్రచారం కలిగించే విధంగా ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు.
బుద్ధ వనములో మంగళవారం నిర్వహించే బతుకమ్మ సంబరాలలో పాల్గొనే వారికి నందికొండ మున్సిపాలిటీ పరిధిలో రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. అంతేకాకుండా బుద్ధ వనములో నిర్వహించే బతుకమ్మ సంబరాలలో పాల్గొని బతుకమ్మలకు న్యాయ నిర్ణేతుల నిర్ణయం మేరకు ప్రథమ, ద్వితీయ,తృతీయ బహుమతులను అందజేయనున్నట్లుగా తెలిపారు.