23-08-2025 06:41:55 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పనుల జాతర కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కొత్తగూడ ఎంపిడిఓ రోజా రాణి సూచించారు. పనుల జాతరలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గుంజేడు గ్రామంలో ఉన్న శ్రీ గుంజేడు ముసలమ్మ దేవస్థానం ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యం శానిటరీ సెంటర్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల వ్యక్తిగత, సామూహిక అవసరాలు తీర్చే పనులు చేపట్టడం కోసమే పనుల జాతరను ప్రారంభిస్తున్నట్లు, గ్రామాలలో ప్రజలకు కావల్సిన అవసరాలను గుర్తించడం,
భవిష్యత్తులో కావాల్సిన వాటిని మంజూరు చేయడానికి శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పనుల జాతరను ప్రారంభించినట్లు, స్వచ్ఛ భారత్ మిషన్, ఉపాధి హామీ పథకం, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా పనులను ఎంపిక చేశారన్నారు. వీటిలో పశువుల పాకలు, గొర్రెల షెడ్లు, కోళ్ల ఫారాలు, పాఠశాల మరుగుదొడ్లు, వర్మీ కంపోస్టు గుంతలు, చెక్ డ్యాంలు, ఇంకుడు గుంతలు, సెగ్రిగేషన్ షెడ్లు, ప్లాస్టిక్ వేస్ట్ యూనిట్లు, కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్సులు, అంగన్వాడీ, గ్రామపంచాయతీ భవనాలు ఉన్నాయన్నారు. పనుల జాతరలో ప్రారంభించిన పనులు రానున్న ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ , ఈజీఎస్, ఆలయ పూజారులు, తదితరులు పాల్గొన్నారు.