05-11-2025 01:46:38 AM
అరెస్టయిన నిందితులు
గుత్తా తేజ కృష్ణ, షాజీర్ మోటుంగర, వెన్నెల రవికిరణ్ బన్ను, పకనాటి లోకేష్ రెడ్డి, పెద్దమంటూరు హర్షవర్ధన్ రెడ్డి, మన్నె వెంకట ప్రశాంత్, ప్రుధ్వి విష్ణు వర్ధన్ విష్ణు, కార్లపూడి ప్రెస్లీ సుజిత్, మేకల గౌతమ్, గుండెబోయిన నాగార్జున అర్జున్, గుంటక సతీష్ రెడ్డి.
-గచ్చిబౌలి పోలీసుల అదుపులో 11 మంది
-హాస్టల్, హోటల్లపై సంయుక్త దాడులు
-ఎక్స్టసీ మత్తు మాత్రలు గంజాయి స్వాధీనం
-మధాపూర్ ఎస్ఓటీ గచ్చిబౌలి పోలీసుల సంయుక్త ఆపరేషన్
శేరిలింగంపల్లి, నవంబర్ 4(విజయక్రాంతి): హైటెక్ హబ్లో మత్తు వ్యాపారానికి చెక్ పడింది. యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ ముఠాను గచ్చిబౌలి పోలీసులు బట్టబయలు చేశారు. మధాపూర్ జోన్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటి) సహకారంతో నిర్వహించిన దాడుల్లో 11 మంది నిందితులు అదుపులోకి, మరో 8 మంది పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి ఎమ్డిఎమ్ఏ (ఎక్స్టసీ మత్తు మాత్రలు), గంజాయి, మొబైల్ ఫోన్లు, బైకులు, నగదు సహా పలు వస్తువులు స్వాధీనం అయ్యాయి. నవంబర్ 3న నమ్మకమైన సమాచారం ఆధారంగా పోలీసులు టీఎన్జీఓస్ కాలనీ, గచ్చిబౌలిలోని ఎస్ ఏం లగ్జరీ గెస్ట్ రూమ్ కో లివింగ్ పీజీ హాస్ట్ప దాడి చేశారు.
అక్కడ గుత్తా తేజ కృష్ణ, పకనాటి లోకేష్ రెడ్డిలను పట్టుకున్నారు. వీరి విచారణలో బయటపడిన వివరాల ఆధారంగా పోలీసులు మధాపూర్లోని హోటల్ నైట్ ఐ వద్ద దాడి చేసి వెన్నెల రవికిరణ్ బన్ను, పెద్దమంటూరు హర్షవర్ధన్ రెడ్డి, మన్నె ప్రశాంత్, షాజీర్ మోటుంగరలను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం ఈ ముఠా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తోందని తేలింది. ప్రధాన నిందితులు ఇంటర్స్టేట్ సరఫరాదారుల నుండి ఎక్స్టసీ మత్తు మాత్రలు తెప్పించుకుని స్థానిక నెట్వర్క్ ద్వారా పంపిణీ చేస్తున్నారు. వీరి ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ లింకులు, ఆన్లైన్ చెల్లింపుల మార్గాలు ఏవో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పరారీలో ఉన్నవారు....
అజ్ఞాత నైజీరియన్లు, వినయ్, లక్ష్మణ్, రిజ్వాన్, కార్తీక్, వంశీ, హర్ష.స్వాధీనం చేసుకున్న వస్తువులు: ఎమ్డిఎమ్ఏ (ఎక్స్టసీ మత్తు మాత్రలు) 32.14 గ్రాములు, గంజాయి 4.67 గ్రాములు, మొబైల్ ఫోన్లు 6, బైకులు 2, నగదు రూ.10,000, వెయింగ్ మెషీన్, ప్యాకింగ్ మెటీరియల్. ఈ ఘటనపై క్రైమ్ నంబర్ 2556/2025 కింద ఎన్ డిపిఎస్ చట్టంలోని 8(సి) ఆర్ డబ్లు 22(బీ), 22(సి), 25, 27, 28, 29 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ వాడకమూ, విక్రయమూ రెండూ నేరం, యువతను ఈ మత్తు ముఠాల వలలో పడనివ్వం నగరాన్ని డ్రగ్ రహితంగా మార్చడమే మా లక్ష్యం, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతాం అని పోలీసులు కోరారు.