26-12-2025 01:19:36 AM
నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్
హుజూర్ నగర్, డిసెంబర్ 25(విజయక్రాంతి) : ఏసుప్రభు బోధనలు ప్రపంచానికి మార్గదర్శకమని ఆచరణీయమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం హుజూర్ నగర్ పట్టణంలోని పలు చర్చిలలోలతో పాటు మఠంపల్లిలో మిడ్ నైట్ ప్రార్థనలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ...మనిషి జన్మ సార్థకం కావాలంటే ఏసు బోధించిన ప్రేమ సమానత్వం బాటలో నడవాలన్నారు.
మనిషి పుట్టినప్పుడు శ్వాస ఉంటుందని మనిషి పోయిన తర్వాత పేరు మాత్రమే ఉంటుందన్నారు. అందర్నీ ప్రేమించడం అందరిని సన్మార్గంలో పెట్టడం ఏసు బోధించిన బోధనల నుంచి స్ఫూర్తి పొందాలన్నారు. ఏసు మార్గం చదువు సంస్కారాన్ని నేర్పిస్తుందని శాంతి సమానత్వం ప్రేమను పంచుతుందన్నారు. అందుకే ప్రతి ఒక్కరు సన్మార్గంలో నడవాలన్నారు.
అనంతరం కేకును కట్ చేసి క్రిస్టియన్స్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆదూరి స్రవంతికిషోర్ రెడ్డి, హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, మఠంపల్లి మండల అధ్యక్షుడు మంజు నాయక్,బచ్చలకూరి బాబు, ఆదూరి కిషోర్ రెడ్డి, పలు సర్పంచులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కోదాడలో
కోదాడ, డిసెంబర్ 25(విజయక్రాంతి): ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళికి మార్గదర్శకాలని రాష్ట్ర పౌరసరపరాల, నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని కోదాడ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ సిసిఆర్ విద్యా నిలయంలో గురువారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ అనేది కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది ప్రేమ, శాంతి, ఆశను మనకు గుర్తుచేసే రోజు అన్నారు. యేసు క్రీస్తు బోధించిన దయ, వినయం, సేవా భావం మన జీవితాల్లో కనిపించాలన్నారు. ద్వేషాన్ని విడిచి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ శాంతియుత జీవనాన్ని గడపాలన్నారు. అలాగే అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం, బాధలో ఉన్నవారిని ఓదార్చడం నిజమైన క్రిస్మస్ సందేశమని, ఈ క్రిస్మస్ పండుగ మన హృదయాల్లో కొత్త వెలుగును నింపాలన్నారు.
మన కుటుంబాల్లో ప్రేమ పెరగాలనీ, మన సంఘంలో ఐక్యత బలపడాలనీ ప్రభువైన యేసును మనస్ఫూర్తిగా కోరుతున్నట్లు తెలిపారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథా లయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, మాజీ సర్పంచ్ చైర్మన్ ఎర్నేని బాబు, సుపీరియర్ సిస్టర్ నక్షత్రం, ప్రధానోపాధ్యాయులు ఆన్ జ్యోతి పాల్గొన్నారు.
అందరూ సుఖసంతోషాలతో ఉండాలి
మఠంపల్లి, డిసెంబర్ 25(విజయక్రాంతి): మండలంలోని మఠంపల్లి పెద్ద చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానవాళిలో ఆనందం నింపిన ఏసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నాడు.
ఏసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలంతా సుఖ సంతోషాలతో జరుపుకోవా లని, ఏసుక్రీస్తు దీవెనలు ప్రజలందరిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, తాహశీల్దార్ లావురి మంగా,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూక్యా మంజీ నాయక్, సర్పంచ్ ఏసుమళ్ళ వీరలక్ష్మి, మాజీ సర్పంచ్ ఆదూరి కిషోర్ కుమార్ రెడ్డి, ఉపసర్పంచ్ కొత్తపల్లి శౌరి, సీనియర్ నాయకులు, సర్పంచ్లు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.