03-08-2025 01:01:23 AM
నర్మెట,(విజయక్రాంతి): మండల కేంద్రంలో మస్జిద్ వద్ద పారిశుధ్యం లేకపోవడంపై స్థానికంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మోరీలు తీసినప్పటికీ చెత్తను బయట తరలించకుండా మళ్లీ అదే మోరీలో వదిలేసిన ఘటనపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గ్రామానికి చెందిన పౌరుడు మొహమ్మద్ తఫ్జీల్ స్వయంగా మోరీలు వద్ద ఉన్న చెత్తను తట్టలతో తీసి బయట పారవేశారు. మోరీలు తీసిన 20 రోజులు గడుస్తున్నా. గ్రామపంచాయతీ సిబ్బంది చెత్తను తరలించలేదు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. చివరికి నేనే తీసి పారేయాల్సి వచ్చింది. అని ఆయన తెలిపారు. చెత్త కారణంగా దుర్వాసన, దోమలు, చిన్నపిల్లలకు ఆరోగ్య సమస్యలు మరియు సీజనల్ వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంది అన్నారు. గ్రామ పంచాయతీ పారిశుధ్య సిబ్బంది తమ పనిని పూర్తిగా చేయకపోవడం వల్ల ప్రజలు స్వయంగా పనిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ సమస్యను వెంటనే గ్రామ కార్యదర్శి మరియు ఎంపీడీవో ఈ విషయాన్ని తక్షణమే గమనించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.