23-12-2025 02:03:59 AM
మహబూబాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని చెన్నారావుపేట గ్రామపంచాయతీ పాలకమండలి పదవీ బాధ్యతల స్వీకారోత్సవంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఘర్షణకు దిగారు. ప్రమాణ స్వీకార వేడుకల సందర్భంగా సభా వేదిక వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆ పార్టీకి సంబంధించిన పాటను మైకు ద్వారా వినిపించడంతో కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇది పార్టీ కార్యక్రమం కాదని, ఇరు పార్టీలకు సంబంధించి వార్డు సభ్యులు గెలుపొందారని, అధికారిక కార్యక్రమంలో పార్టీ పాటలు వెంటనే బంద్ చేయాలని డిమాండ్ చేయగా ఇరు వర్గాల మధ్య మాట పెరిగి తోపులాట జరిగింది. అనంతరం ఇరువర్గాల మధ్య మరింత ఘర్షణ చెలరేగి కుర్చీలతో పరస్పరం కొట్టుకున్నారు. ఈ సంఘటనలో ఇరు వర్గాలకు చెందిన ఇద్దరు నాయకులు గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడ్డ రమేష్, శోభన్ లను ఆస్పత్రికి తరలించారు.