వర్షాలకు ముందే నాలాల ప్రక్షాళన
- చెత్త తొలగింపు పనులు వేగవంతం చేయాలి
ఆక్రమణలు లేకుండా చూడాలి
హైడ్రా కమిషనర్ రంగనాథ్
చింతలబస్తీలో బుల్కాపూర్ నాలా పరిశీలన
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 13 (విజయక్రాంతి): వర్షాలు రాకముందే భాగ్య నగరంలో నాలాల ప్రక్షాళన చేపట్టాలని, నగరంలో వరద ముప్పును నివారించేందుకు నాలాల్లో పేరుకుపోయిన చెత్తను, పూడికను వేగంగా తొలగించాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం చింతలబస్తీ మీదుగా సాగే బుల్కాపూర్ నాలా విస్తరణ పనులను ఆయన పరిశీలించారు.
గత బుధవారం హైడ్రా అధికారులు బుల్కాపూర్ నాలా ఆక్రమణలు తొలగించిన విషయం తెలిసిందే. అయితే, ఆక్రమణలు తొలగించినప్పటికీ కబ్జాల వల్ల కల్వర్టు కింద సగం భాగం పూడుకపోయినట్లు కమిషనర్ గుర్తించారు. ఈ పూడికతీత పనులతో పాటు, మిగిలిన ఆక్రమణల తొలగింపు పనులను త్వరగా పూర్తి చేయాలని రంగనాథ్ ఆదేశించారు. వరదనీటి ప్రవాహానికి ఆటంకం కలిగించే కబ్జాలు ఇతర ప్రాంతాల్లో కూడా ఉంటే వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు






