03-11-2025 10:09:47 PM
చివ్వెంల (విజయక్రాంతి): చివ్వెంల మండలంలోని ఉండ్రుగొండ గ్రామానికి చెందిన పర్వతం రామూర్తి(48) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. వివరాల ప్రకారం.. రామూర్తి ప్రతిరోజూ సూర్యాపేటకు వెళ్లి కార్పెంటర్గా పనిచేసేవాడు. ఆదివారం సాయంత్రం సుమారు 6.15 గంటల సమయంలో పనులు ముగించుకొని స్వగ్రామానికి తన మోటార్సైకిల్పై తిరుగు ప్రయాణమవుతుండగా, ఉండ్రుగొండ ఆర్చి సమీపంలో రోడ్డును దాటే ప్రయత్నంలో హైదరాబాదు వైపు నుండి విజయవాడ దిశగా వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది.
దీంతో రామూర్తి మోటార్సైకిల్తో సహా రోడ్డుపై పడిపోవడంతో తలకు, శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలు అయ్యి అక్కడిక్కడే మరణించాడు. ఈ ఘటనపై మృతుడి భార్య శోభ ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి. మహేశ్వర్ కేసు నమోదు చేసి, మృతదేహంపై పీఎంఈ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య శోభతో పాటు ముగ్గురు కుమార్తెలు సంతానం ఉన్నారు. ఈ ఘటనతో ఉండ్రుగొండ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.