24-07-2025 12:29:24 AM
ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాల, ఆగ్రోస్ కేంద్రాల పరిశీలన
చేర్యాల, జులై 23: చేర్యాల పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మికంగాతనిఖీ చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్ పరిశీలించారు. రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి ఉద్యోగులు గైర్హాజర్ కాకుండా చూసుకోవాలని ఆస్పత్రి సూపరిండెంట్ ను ఆదేశించారు.
వ్యాధులు వ్యాప్తి కాకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని సూచించారు. వైద్య సేవ ఏ విధంగా అందుతున్నాయో రోగులను అడిగి తెలుసుకున్నారు. వ్యాధులు ప్రబలకుండా ఆహార విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. భవనానికి అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టే లోపు, పాత ఆసుపత్రిలోని పరికరాలను కొత్త భవనంలోకి షిఫ్ట్ చేసి వైద్య సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.
పట్టణంలోని ఇందిరమ్మ ఇల్లుకు ముగ్గు పోసే కొబ్బరికాయ కొట్టి, నిర్మాణ పనులు ప్రారంభిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకకు ఆటంకం లేకుండా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. త్వరగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టినవారికి వెంటనే బిల్లు ఖాతాలో జమ అవుతుందన్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు.
తనిఖీ చేసే సమయంలో విద్యార్థులు లేకపోవడంతో కారణాన్ని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు. స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు.
రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తుల డిస్పోజలను పరిశీలించారు. వచ్చిన అన్ని దరఖాస్తులకు నోటీసులు జారీ చేసి, క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించి వాటికి పరిష్కారం చూపాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.