02-11-2025 10:48:28 PM
చేర్యాల: చేర్యాల మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆదివారం ఆకస్మికంగా సందర్శించి రాత్రి భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి వంట గదికి వెళ్ళి రాత్రి భోజనంకు సంబంధించి ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు ప్రకారం వంట సరుకులు అందించారా, సన్నబియ్యం నాణ్యత ఎలా ఉంటుంది అని ఆరా తీశారు. రిజిస్టర్లు చెక్ చేస్తూ స్టాక్ రిజిస్టర్ సక్రమంగా మెయింటెన్ చెయ్యాలని ఆగ్రహించారు. కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని విద్యార్థులకు రుచికరంగా వండాలని, మెనూ పాటించకుండా కూరగాయలు దొరకట్లేదని సాకులు చెప్తే ఉపేక్షించేది లేదని వంట సిబ్బందిని హెచ్చరించారు.
విద్యార్థులను ఆప్యాయంగా పలకరించారు. విద్యార్థులకు వడ్డించే ప్రక్రియను పరిశీలించి కడుపునిండా తినాలని బాగా తింటేనే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని తెలిపారు. తల్లిదండ్రుల నుండి దూరంగా ఉన్నామని బాధపడవద్దని గురుకుల వాతావరణం అలవాటు చేసుకుని మంచి క్రమశిక్షణ అలవాట్ల అలవర్చుకుని చదువు విషయంలో అస్సలు రాజీపడవద్దని ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి సమయం వృథా చేయకుండా నిరంతరం శ్రమించాలని విద్యార్థులకు తెలిపారు.