02-09-2025 05:51:31 PM
ఎల్లారెడ్డిపేట,(విజయక్రాంతి): ఎల్లారెడ్డిపేట మండలంలోని పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, పోతిరెడ్డిపల్లి గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించారు. స్కూల్లో 25 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ, భోజనంగా కేవలం గోంగూర పచ్చడి మాత్రమే ఇవ్వడాన్ని కలెక్టర్ గమనించారు.
వెంటనే విద్యా వాలంటీర్ను నియమించాలన్నారు. అలాగే, గ్రామంలో అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను పరిశీలించి, అన్ని వార్డుల్లో రోజూ పారిశుధ్య పనులు నిర్వహించాలని సూచించారు.గ్రామ పంచాయతీ కార్యదర్శికి సూచనలు ఇచ్చిన కలెక్టర్, పాఠశాల ఆవరణలో తగినంత వసతి కలిగిన కిచెన్ షెడ్ నిర్మించాలని ఆదేశించారు.
వెంకటాపూర్ పాఠశాలల్లో తనిఖీలు.. విద్యార్థులకు కలెక్టర్ పాఠాలు
వెంకటాపూర్ గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలలోను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు వివరాలు, డిజిటల్ తరగతుల వివరాలు, బెంచీలు, గదుల సమాచారం పరిశీలించారు. పిల్లలతో చర్చించి పలు సమస్యలు తెలుసుకున్నారు. అదనంగా, వారికి గణితంలో పాఠాలు బోధించారు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్లు పంపిణీ చేయాలని, కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తరగతుల్లో గ్రీన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. మధ్యాహ్న భోజనాన్ని గ్యాస్ స్టౌ పైనే సిద్ధం చేయాలన్నదిగా స్పష్టంగా ఆదేశించారు.