16-12-2024 02:24:34 PM
పెద్దపల్లి,(విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి ప్రజల దరఖాస్తులు స్వీకరించారు. ఎలిగేడు మండలం లాలపల్లె గ్రామ నివాసి బోగ కనకమ్మ తన భర్త భూమయ్య గ్రామ రెవెన్యూ సహాయకుడిగా ఎలిగేడు మండలంలో పని చేస్తూ డిసెంబర్ 5 2023 నా మరణించాడని, అతని యొక్క గ్రాచ్యూటీ ఇన్సూరెన్స్ ఇంతవరకు రాలేదని దాన్ని త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా కలెక్టరేట్ పరిపాలన అధికారికి రాస్తూ వెంటనే పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. గోదావరిఖని బాపూజీ నగర్ కు చెందిన బోయిని ఓదెమ్మ తన భర్త జూలై 19, 2023 నాడు మరణించారని, తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రజావాణిలో జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.