calender_icon.png 17 August, 2025 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

16-08-2025 09:07:22 PM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,(విజయక్రాంతి): భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప భయటకు రావద్దని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శనివారం హాజీపూర్ మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టులో నీటిమట్టం వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న 24 నుంచి 36 గంటలు భారీ నుండి అతి భారీ వర్ష సూచన ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

జిల్లాలో శని వారం రెడ్ అలర్ట్, ఆదివారం ఆరెంజ్ అలర్ట్ ఉందని, ప్రజారక్షణ దిశగా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతుందన్నారు. ఎస్ఆర్ఎస్పి, కడెం ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో పెరుగుతుందని, ప్రాజెక్టులో 17 టి.ఎం.సి. నీటిమట్టం దాటితే ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసి నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. నది పరివాహక ప్రాంతాల వద్దకు, వాగులు, నదులు దాటవద్దని ప్రజలకు సూచించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలలో నివసించే వారిని వెంటనే తరలించాలని, వాగులు, నదులు ఉదృతంగా ప్రవహించే సమయంలో ప్రజలను, వాహనదారులను అటువైపుగా వెళ్లకుండా సిబ్బంది బందోబస్తు చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. రహదారులు, కల్వర్టులు దెబ్బతింటే ఆ ప్రాంతంలో ప్రమాద సూచికలు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, వైద్య సిబ్బంది వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం జరగకుండా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజల తక్షణ సహాయం కోసం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ (08736- 250501) ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉంటున్నామన్నారు. జిల్లాలో 90 మంది సభ్యులతో కూడిన 3 ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందాలు, రక్షణ పరికరాలతో తక్షణ సహాయం కోసం సిద్ధంగా ఉన్నారని, లో లెవెల్ కాజ్ వేల వద్ద ప్రజలు వెళ్లకుండా భారీ కేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.