05-12-2025 12:00:00 AM
నారాయణపేట. డిసెంబర్ 4 (విజయక్రాంతి) : గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన సామాగ్రి పంపిణీని కార్యక్రమాన్ని గురువారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షించారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని శ్రీ దత్త బృందావన్ బీఈడీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ గురువారం సందర్శించారు.
జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే కోస్గి, కొత్తపల్లి, గుండుమల్, మద్దూర్ మండలాలలోని అన్ని గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక కోసం అవసరమైన బ్యాలెట్ పేపర్లు, బాక్సులు, ఇతర సామాగ్రి అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా అని కలెక్టర్ సంబంధిత అధికారిని అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ ల ఎన్నిక కోసం, వార్డు సభ్యుల ఎన్నిక కోసం ముద్రించిన బ్యాలెట్ పేపర్లను కలెక్టర్ పరిశీలించారు.
అదే విధంగా రెండు, మూడో విడత ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్న బ్యాలెట్ బాక్స్ లను ఆమె పరిశీలించి, ఇంకా ఏమైనా అవసరమైతే తెప్పించుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్, ఎస్ డి సి రాజేందర్ గౌడ్, డిపిఓ సుధాకర్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, మద్దూరు, గుండుమల్ ఎంపీడీవోలు పాల్గొన్నారు.