05-12-2025 12:00:00 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి
మహబూబ్నగర్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): మీ గమ్యాన్ని నిర్ణయించే కీలక దశ పదవ తరగతి అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తన స్వంత నిధులతో నిష్ణాతులైన అధ్యాపకుల బృందం చేత క్యూఆర్ కోడ్ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను తయారు చేయించి, నగరంలోని మహబూబ్నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గత రెండు సంవత్సరాలుగా ఉచితంగా అందజేస్తున్నారు.
అందులో భాగంగా గురువారం ప్రభుత్వ న్యూ టౌన్ ఉన్నత పాఠశాల, బేసిక్ ప్రాక్టీస్ ఉన్నత పాఠశాల, మాడ్రన్ హైస్కూల్లలో విద్యార్థులకు ఈ క్యూఆర్ కోడ్ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మహబూబ్నగర్ వంటి అభివృద్ధి చెందుతున్న నగరాలకు విద్యే ప్రధాన శక్తి అని ఆయన అన్నారు.
టెక్నాలజీ ఆధారిత విద్య ఇప్పుడు తప్పనిసరి అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా సమాన అవకాశాలు పొందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహబూబ్నగర్ ఫస్ట్ స్థానంలో నిలవాలంటే ముందుగా మన పిల్లల భవిష్యత్తు బలపడాలని అన్నారు. ఆ బలం సంపాదించేది ఒక్క విద్య ద్వారానే సాధ్యమని చెప్పారు. విద్యార్థులు తమలోని ప్రతిభను గుర్తించి, టార్గెట్ ఐఐఐటి లక్ష్యంగా పెట్టుకుని క్రమశిక్షణతో, నిబద్ధతతో ముందుకు సాగాలి అని ఆయన అన్నారు.
పదవ తరగతి మీ జీవితంలో చిన్న అడుగు కాదని, మీ గమ్యాన్ని నిర్ణయించే కీలక దశ అని గుర్తించుకోవాలి అని ఆయన చెప్పారు. డిజిటల్ స్టడీ మెటీరియల్స్ను పూర్తిగా వినియోగించుకుని ప్రతిభను నిరూపించాలని, మీరు విజయాన్ని స్పష్టమైన లక్ష్యంతో కోరు కుంటే, దానిని సాధించే మార్గాలు స్వయంగా మీ ముందుకు వస్తాయి అని ఆయన విద్యార్థులకు విద్యార్థులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇంచార్జీ గోనెల శ్రీనివాసులు, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేంధర్, వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మోసిన్, అంజద్, నాయకులు చందుయాదవ్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
దత్తాత్రేయ స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ టౌన్, డిసెంబర్ 4: శ్రీ దత్తాత్రేయ జయంతి పురస్కరించుకుని మహబూబ్నగర్ నగర తూర్పు కమాన్ సమీపంలో కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే ని పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతించి వేద మంత్రోచ్చరణల మధ్య యథావిధిగా పూజలు నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి కటాక్షం మహబూబ్నగర్ నగర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రతి ఇంటినీ నింపాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యేకి ఆలయ అర్చకులు వేదాశీర్వాదాలు అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమం లో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇంచార్జీ గోనెల శ్రీనివాసులు, నాయకులు మున్నూరు రవి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.