11-08-2025 12:00:00 AM
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డి
సూర్యాపేట ఆగస్టు 10 (విజయక్రాంతి) : బిజెపి సహకారంతోనే కాంగ్రెస్ కెసిఆర్ పై కుట్రలు చేస్తుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో ఆదివారం జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఇద్దరికి కెసిఆరే ప్రధాన శత్రువన్నారు. రేపటి తెలంగాణ కెసిఆర్ దే అని వాళ్లకు అర్థమైందన్నారు. అందుకే వారు కుట్రలు పన్నుతున్నారన్నారు. రేవంత్, బండి సంజయ్ ల రాజకీయ చరిత్ర అందరికీ తెలుసన్నారు. స్ట్రీట్ ఫెలోస్ స్టేట్ లీడర్ అయిండు.. గల్లి నాయకుడు ఏకగ్రీవంగా ఢిల్లీ ప్రమోషన్ రావడంతోనే ప్రజలకు కష్టాలు వచ్చినయి అన్నారు.
సమస్యల పైన అవగాహన లేక, అభివృద్ధి చేసే దమ్ము లేక అర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారన్నారు.వాస్తవానికి బీజేపీ, కాంగ్రేస్ జాతీయ పార్టీలుగా ఒకరినొకరు విమర్శించుకోవాలి. కానీ ఇద్దరూ కలిసి కెసిఆర్ విమర్శిస్తున్నారన్నారు.
నిజంగా ట్యాపింగ్ చేయించింది కేటీఆర్ అని బండి సంజయ్ నువ్వు ప్రమాణం చేస్తావా అని ప్రశ్నించారు.ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని సరైన సమయంలో వారు తప్పక స్పందించి తగిన బుద్ధి చెప్తారు అన్నారు. ఈ సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.