16 June, 2026 | 11:01 PM

బీఆర్‌ఎస్ దారిలోనే కాంగ్రెస్

11-09-2025 12:55 AM

-నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం

-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు 

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): గ్రూప్ పరీక్ష పత్రాలు పునః మూల్యాంకనం చేయాలని హైకోర్టు తీర్పునివ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు.  గ్రూప్ ౧ అభ్యర్థుల హక్కుల కోసం ఇటీవల గళమెత్తిన సందర్భంగా బుధవారం పలువురు నిరుద్యోగులు రాంచందర్‌రావు ఇంటికి వెళ్లి సన్మానించారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనూ పేపర్ లీకేజీ ఘటనతో వేలాది మంది విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, అదే పరంపరను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని మండిపడ్డారు.  గ్రూప్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వ సర్వీస్ కమిషన్ నిర్వహించిన మెయిన్స్ పరీక్షా ప్రక్రియలో గందరగోళం, లెక్కలేనన్ని అవకతవకలు జరిగాయని, టీజీపీఎస్సీ వ్యవస్థలో ఉన్న లోపాలు బయటకు వచ్చాయని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం వైఖరి లక్షలాది మంది విద్యార్థుల పాలిట శాపంగా మారందని రాంచందర్‌రావు మండిపడ్డారు. నోటిఫికేషన్ విడుదల నుంచి ప్రశ్నాపత్రాల మూల్యాంకనం వరకు టీజీపీఎస్సీ చాలా లోపాలతో కూడిన విధానాలను అవలంబించిందన్నారు.