23-08-2025 01:18:11 AM
హైదరాబాద్లోని గాంధీభవన్లో శనివారం సాయంత్రం 5 గంటలకు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరుగను న్నది. సమావేశానికి ఏఐసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్య క్షుడు మహేశ్కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఇతర సభ్యులు హాజరుకానున్నారు.
సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాలపై చర్చిస్తారని సమాచారం.. బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఎన్నికలు నిర్వహించాలా.. వద్దా? ఒకవేళ ఎన్నికలకు వెళితే రిజర్వే షన్లు పార్టీ పరంగా ఇవ్వాలా..? మరేదైనా మార్గం ఆలోచించాలా అన్న కోణంలో చర్చలు సాగుతాయని బోగట్టా.
స్థానిక సంస్థల ఎన్నికలను హైకోర్టు సెప్టెంబరు 30లోపు నిర్వహించాలని గడువు విధించిన నేపథ్యం లో ఈ అంశంపైనే చర్చసాగుతుందని, మెజార్టీ సభ్యుల నిర్ణయం మేరకు అధిష్ఠానం ఒక నిర్ణయానికి వస్తుందని తెలిసింది. అలాగే ఇదే సమావేశంలో నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా అధిష్ఠానం ఒక నిర్ణయం తీసుకుం టుందనే ప్రచారం సాగుతున్నది. మంత్రి పదవులు, ప్రభుత్వ సలహాదారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీ అధ్యక్ష పదవుల కట్టబెట్టే అంశంపై ఒక నిర్ణయానికి రావొచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.