27-08-2025 12:00:00 AM
కలెక్టర్ రాహుల్ శర్మ
రేగొండ/భూపాలపల్లి ఆగస్టు26 (విజయ క్రాంతి): జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని వసతి గృహాల్లో అధికారులు, పోలీసు యంత్రాంగం, క్లస్టర్ లు సోమవారం నుండి ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం తెలిపారు.
వసతి గృహాల విద్యార్థుల సంక్షేమం, సౌకర్యాల కల్పన పట్ల ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. విద్యార్థులు ఏ ఇబ్బందులు ఎదుర్కొన్న నిర్భయంగా అధికారులకు తెలియజేయాలని సూచించారు.విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
విద్యార్థుల పై ఉపాధ్యాయులు,వార్డెన్ లు కఠినత్వం చూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారులు, పోలీస్ అధికారులు వసతి గృహాల్లో మెనూ అమలను పరిశీలించి విద్యార్థులతో కలిసి అల్పాహారం, మధ్యాహ్న భోజనం చేస్తూ, విద్యార్థుల ఇబ్బందులను సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.